డ్వాక్రా ఉత్పత్తులను పరిశీలిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
- రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులను ఆదరించాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. నగరంలోని ఎన్టిఆర్ మున్సిపల్ మైదానంలో డిఆర్డిఎ ఆధ్వర్యాన ఏడు రోజుల పాటు నిర్వహిస్తున్న డ్వాక్రా బజారును బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా బలపడాలన్నారు. డ్వాక్రా రుణాల మాఫీని నాలుగు విడతల్లో పూర్తి చేశామన్నారు. సంప్రదాయ చేతివృత్తుల వారు మార్కెటింగ్ చేసుకునే ఆర్థిక స్తోమత వారికి ఉండబోదని, అందుకోసమే డ్వాక్రా బజారు పేరిట స్వయం సహాయక మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రదర్శించడంతో పాటు విక్రయించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. చౌక ధరలకే పట్టణ ప్రజలకు అందించాలనే 72 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మహిళా సంఘాలకు ఇచ్చిన హామీ గాలికి వదిలేశారని విమర్శించారు. ఇప్పుడు కొత్త హామీలతో వస్తున్న ఆయన్ను మహిళలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అనంతరం స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో డిఆర్డిఎ పీడీ డి.వి విద్యాసాగర్, ఎల్డిఎం ఎం.సూర్యకిరణ్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు ఎం.కృష్ణవేణి, వైసిపి నాయకులు చల్లా అలివేలుమంగ, రౌతు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.