టిడిపి అధికారంలోకి రావడం తథ్యం

Nov 29,2023 00:25

ప్రజాశక్తి-పొదిలి: జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి కీలకమైన వెలుగొండ ప్రాజెక్టును తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నందిపాలెం గ్రామంలో బూత్‌ లెవెల్‌ కమిటీ సభ్యుల సమావేశంలో నారాయణరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలపై ఆక్రమ కేసులు బనాయించే దుర్మార్గపు ఆలోచనలు చేస్తోందని, వాటిని మానుకోవాలని అన్నారు. కీలకమైన వెలుగొండ ప్రాజెక్టును వాయిదాల ప్రాజెక్టుగా మార్చిన ఘనత జగన్‌కు దక్కుతుందని అన్నారు. అధికార పార్టీ అక్రమాలను ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని అన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని అన్నారు. కార్యకర్తలు గ్రామగ్రామాన తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసి అధికార పార్టీ అక్రమాలు ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్‌, మాజీ జడ్‌పిటిసి కాటూరి వెంకట నారాయణబాబు (పెద్దబాబు), కాటూరి నారాయణప్రతాప్‌ (చిన్నబాబు), నాయకులు మీగడ ఓబుల్‌రెడ్డి, ముల్లా ఖుర్దూస్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్‌ (పండు), గౌస్‌, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

➡️