జిల్లాలో ఈనెల 3వ తేదీ నుండి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్ ఆదేశించారు. మంగళవారం జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీపై ఎంపిడిఓలు, తహశీల్దార్లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ చేయాలని, నగదు డ్రా చేసేందుకు సచివాలయ కార్యదర్శులకు అనుమతి ఇవ్వాలని తహశీల్దార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ డిఆర్ఓ, డిఆర్డిఎ పిడి, మెప్మా పీడీ, డిపిఓ, డిఎల్డిఓల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలన్నారు. పింఛన్ల కోసం సచివాలయాలకు రాలేని వారికి 6వ తేదీ ఇంటి వద్దనే పంపిణీ చేయాలని, మొత్తం ఈ కార్యక్రమం జిల్లాలో నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బంది రాకుండా కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ ఉంటుందని ఏదైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ ద్వారా పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు. డిఆర్ఓ పుల్లయ్య, డిఆర్డిఎ పిడి తులసి, డిపిఓ లక్ష్మి, డిఎల్డివో రవికుమార్ పాల్గొన్నారు.