ప్రజాశక్తి-పెరవలి అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వెంటనే జిఒలు విడుదల చేయాలని అంగన్వాడీ విజయోత్సవ సభలో ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం పెరవలిలో ప్రాజెక్టు అంగన్వాడీల విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీల ఐక్యతను ఆయన కొనియాడారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.సుందర్ బాబు మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలపై త్వరలో జిఒలు విడుదల అవుతాయన్నారు. అంగన్వాడీలు సుదీర్ఘంగా చేసిన పోరాట ఫలితమే మిగతా యూనియన్లకు కూడా దిశా నిర్దేశం అవుతుందని అన్నారు. పెరవలి ప్రాజెక్టు ప్రెసిడెంట్ కంకటాల లక్ష్మీ కుమారి, నాయకులు కృష్ణవేణి, మాధవి, విజయనిర్మల, పార్వతి, ధనలక్ష్మి, నాగవేణి, రామలక్ష్మి, రంగ నాయకి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.