గ్రామ పంచాయితీల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలి: తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామపంచాయితీలు కాలపరిమితి 2024 జనవరి 31తో పూర్తవుతుందున తక్షణమే ఎన్నికలను నిర్వహించాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలక వర్గాలను రద్దు చేసి స్పెషల్‌ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించి, కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలెన్నుకున్న పాలకవర్గాల స్ధానంలో ప్రత్యేక అధికారుల పాలనను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ వ్యతిరేకిస్తున్నది. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయితీలకు విధిగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపి, ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకవర్గాలను కొనసాగించి, గ్రామ స్వరాజ్యాలుగా తయారు చేయాలి. కానీ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా గ్రామ పంచాయితీలను జేబు సంస్ధలుగా వాడుకుంటున్నది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండు సార్లు పంచాయితీ ఎన్నికలు జరిపినప్పటికీ, ప్రజాతంత్ర యుతంగా నడపడంలో విఫలం చెందింది. పంచాయితీల సంఖ్యను 12,741కి పెంచినప్పటికీ బడ్జెట్‌ మాత్రం 2023-24 ఆర్ధిక సంవత్సరానికి రు.14,369 కోట్లు మాత్రమే కేటాయించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్న నమ్మకంతో సర్పంచ్‌లు సొంత డబ్బుతో గ్రామ పంచాయితీల్లో రహదారులు, స్మశాన వాటికలు, పల్లెవనాలు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, పారిశుద్ధ్య నిర్వహణకు ట్రాక్టర్ల కొనుగోలు, దాంతో పాటు కనీసం 5ా8 మంది సిబ్బందిని నియమించి ఆ వ్యయం అంతా భరించారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు, అసలు చెల్లించలేక 28 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 14, 15 ఫైనాన్స్‌ కమిషన్‌లు ఇచ్చిన నిధులు కూడా గ్రామ పంచాయితీలకు పంపిణీ చేయలేదు. ఆ నిధులను కూడా వక్రమార్గం పట్టించారు.వామపక్ష ప్రభుత్వాలు గ్రామ పంచాయితీలకు బడ్జెట్‌లో 45శాతం నిధులు కేటాయించి స్వయం పాలన ద్వారా గ్రామాలను అభివఅద్ధి చేశారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామపంచాయితీలకు 29 అంశాలను రాష్ట్రప్రభుత్వం బదిలీ చేయవల్సి వున్నప్పటికీ నేటికీ చేయకపోవడంతో ప్రభుత్వం చేతిలో పంచాయితీలు కీలుబమ్మలుగా మారాయి. ప్రజలచేత ఎన్నుకోబడ్డ పాలకవర్గాలను కొనసాగించాల్సిన ఆవశ్యకత రీత్యా వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. బాకీలను విడుదల చేయాలి. ప్రభుత్వ ఆధీనంలో వున్న గ్రామాభివఅద్ధి అంశాలను పంచాయితీలకు బదిలీ చేయాలి. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ నిధులను కూడా నేరుగా పంచాయితీలకు విడుదల చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తున్నది.

➡️