జిల్లా రెవెన్యూ అధికారికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వినతి
ప్రజాశక్తి – భీమవరం
గణపవరం మండలం విద్యా శాఖను పశ్చిమగోదావరి జిల్లాలో కలపాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు జి.ప్రకాశం కోరారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించేందుకు వెళ్లగా ఆమె అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారికి అందించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన అనంతరం ఏలూరు జిల్లాలో ఉన్న గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేసినట్లు చెప్పారు. ఆ గెజిట్లో రెవెన్యూ, పోలీస్, అన్ని విభాగాలను పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేశారని, విద్యాశాఖ విభాగాన్ని ఏలూరు జిల్లాలోని కొనసాగిస్తున్నారని తెలిపారు. దీంతో గణపవరం మండలంలో పనిచేస్తున్న సుమారు 200 మంది ఉపాధ్యాయులు కొన్ని రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. దీంతో విద్యాశాఖను కూడా పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బివి.నారాయణ, జిల్లా కార్యదర్శి జిడబ్ల్యుపి.కుమార్, భీమవరం మండల ఉపాధ్యక్షులు టి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.