జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న నవీన్, కృష్ణదాస్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఔత్సాహికులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట క్రీడలను నిర్వహిస్తున్నట్టు ఇన్ఛార్జి కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. ఆడదాం ఆంధ్రా కార్యక్రమం ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు ఆదివారం క్రీడాకారులు ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం మానవహారం చేపట్టారు. ముందుగా ఈ ర్యాలీని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. యువతకు మంచి ఆరోగ్యం శరీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో 1,07,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మరికొంత మందికి రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందన్నారు. ఐదు క్రీడా పోటీలను ఈ నెల 26 నుంచి 47 రోజులపాటు సచివాలయాల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీలు నిర్వహిస్తామని అన్నారు. పంచాయతీరాజ్శాఖ, మున్సిపాలిటీలు, విద్యాశాఖ, స్పోర్ట్స్ అధారిటీస్ సమన్వయంతో పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కృష్ణదాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను వేలికి తీసేందుకు ఈ క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. ప్రతిభవంతులైన క్రీడాకారులను గుర్తించడానికి చక్కటి అవకాశమని అన్నారు. కార్యక్రమంలో సహాయక కలెక్టర్ రాఘవేంద్ర మీనా, మున్సిపల్ కమిషనర్ చల్ల ఓబులేసు, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, డిఎస్డిఒ శ్రీధర్, ఆర్డిఒ సిహెచ్.రంగయ్య, సెట్శ్రీ సిఇఒ ప్రసాదరావు, డిఇఒ వెంకటేశ్వరరావు, యూత్ కో-ఆర్డినేటర్ ఉజ్వల్, సమాజ సేవకులు మంత్రి వెంకట స్వామి, వైసిపి నాయకులు మెంటాడ స్వరూప్ పాల్గొన్నారు.