ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సిఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శనివారానికి నాలుగో రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కలెక్టరేట్ వద్ద కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జెఎసి రాష్ట్ర కార్యదర్శి గురువులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేసి, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికిసమాన వేతనం కల్పించాలన్నారు. యంటియస్ అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెలా 1వ తేదీకి వేతనాలు చెల్లించి, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులుమంజూరు చేయాలని, గ్రాడ్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.