కర్నూలు అసెంబ్లీకి సిపిఎం పోటీ

Mar 20,2024 23:15 #CPM candidate, #karnool assemblly

-వామపక్ష అభ్యర్థులను గెలిపించండి

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌ రెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకులు జగన్నాథం

ప్రజాశక్తిాకర్నూలు కార్పొరేషన్‌ కర్నూలు అసెంబ్లీ స్థానానికి సిపిఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌ రెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకులు కె.జగన్నాథం వెల్లడించారు. కర్నూలు సుందరయ్య భవన్‌లో బుధవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సిపిఎం, సిపిఐ పరస్పర సహకారంతో ఎన్నికల్లో ముందుకెళ్లాలని అనుకున్నామని, కాంగ్రెస్‌తోనూ చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే అవి కూడా కొలిక్కి వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యక్షంగా టిడిపి, జనసేన, పరోక్షంగా వైసిపి.. బిజెపిని మోసే పనిలో ఉన్నాయన్నారు. పదేళ్ల బిజెపి పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సాగిందని, మతాన్ని రాజకీయ స్వార్థానికి వినియోగిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు. బిజెపిని ఓడించాలని వామపక్షాలుగా ప్రయత్నం చేస్తున్నామని, కలిసొచ్చే వాళ్లందరినీ కలుపుకుని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నిరంకుశంగా పాలన సాగిస్తున్న వైసిపిని, మతోన్మాద బిజెపితో జతకట్టిన టిడిపి, జనసేనను ఓడించాలని, ప్రజా ఉద్యమాలకు మద్దతు తెలపాలని, వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కె.జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపిని, దానికి మద్దతిస్తున్న పార్టీలను ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా ఉద్యమాల కోసం పోరాటం చేసే వామపక్షాలను, కలిసే శక్తులను గెలిపించాలని కోరారు.

➡️