కరాటే జాతీయ పోటీలు ప్రారంభం

కరాటే జాతీయ పోటీలు ప్రారంభం

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్‌విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు ఆత్మరక్షణకు కరాటే క్రీడ ఎంతో దోహదపడుతుందని లయన్స్‌ క్లబ్‌ జిల్లా మొదటి వైస్‌ గవర్నర్‌ ఈదల ఈశ్వర కుమార్‌, కరాటే ఇండియా చీఫ్‌, ఆంధ్ర, తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఆర్‌ మల్లికార్జున గౌడ్‌ అన్నారు. సామర్లకోట పట్టణంలోని ఇండిస్టియల్‌ ఎస్టేట్‌లోని డిఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో శ్రీ భీమేశ్వర సామర్లకోట లైన్స్‌ క్లబ్‌ సౌజన్యంతో రెండో జాతీయస్థాయి కరాటే ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కరాటే కోచ్‌, కరాటే అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శంకరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను తొలుత ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభ సభలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు వ్యాయామం ఆత్మ రక్షణ క్రీడల్లో ప్రవేశం ఎంతైనా అవసరం ఉందన్నారు. కరాటే క్రీడలో సంపాదించుకున్న సర్టిఫికెట్ల ద్వారా విద్యార్థులు ఉన్నత భవిష్యత్తును పొందగలరన్నారు. క్రీడల్లో రాణించడం ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం అయినప్పటికీ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కోచ్‌ శంకర్‌ ఉచితంగా కాకినాడ నగరం నుంచి విచ్చేసి విద్యార్థులకు ఆత్మ రక్షణ శిక్షణలు కరాటే క్రీడ ద్వారా అందించడం అభినందనీ యమన్నారు. 17 ఏళ్లుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జాతీయస్థాయి పోటీలకు స్థానిక లయన్స్‌ క్లబ్‌ శ్రీ భీమేశ్వర సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లోనూ వారి సహాయాన్ని అందిస్తూ పిల్లలకు విద్యార్థులకు ఆత్మరక్షణ కళలను అందించి ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా కరాటే పోటీలను ముఖ్య అతిథులు ఈశ్వర కుమార్‌, మల్లికార్జున గౌడ్‌ ప్రారంభించారు. తొమ్మిది రాష్ట్రాల నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా వారి అత్యంత ప్రతిభను కనబరిచి పతకాలు సాధించారు. విజేతలకు ముఖ్య అతిథులు పతకాలు, సర్టిఫికెట్లను, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ జిల్లా చైర్మన్‌ చిత్తూరు వీర్రాజు (రాజా), లయన్స్‌ రీజనల్‌ చైర్మన్‌ చిత్తులూరి శ్రీదేవి, జోన్‌ చైర్మన్‌ గణేష్‌ ప్రసాద్‌, అడిషనల్‌ డిస్టిక్‌ క్యాబినెట్‌ సెక్రటరీ ఎం.శివ నాగకృష్ణ, పిఎసిఎస్‌ అధ్యక్షులు మేకా శ్రీనివాసరావు, అధ్యక్షుడు కె.విజయ కృష్ణారావు, కార్యదర్శి ఎస్‌ఆర్‌వైవి.రామలింగ ప్రసాద్‌, కోశాధికారి డి.సీతారామరాజు, ప్రతిభా పాఠశాల కరస్పాండెంట్‌ ఎస్‌వివి.ప్రకాష్‌, ఆంధ్రప్రదేశ్‌ పిఇటి అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎల్‌.జార్జి, కాకినాడ జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షులు వి.రవిరాజు, జనసేన నాయకులు డి.శ్రీనివాసరావు (సరోజ వాసు), ఎండగంటి గ్రామ సర్పంచ్‌ సిహెచ్‌.గోవిందరాజు, కరాటే ఎపి ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్‌ఎన్‌.మూర్తి, టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ నాయకులు బొడ్డు రామారావు, బి.సత్యనారాయణ, ఎం.లోవరాజు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన కోచ్‌లు, వందల సంఖ్యలో విద్యార్థులైన క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️