మాట్లాడుతున్న సిఐటియు సీనియర్ నాయకులు శ్రీనివాసు
ముసిగిన ఇపిఎస్ పెన్షనర్ల రిలే దీక్షలు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఇపిఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.తొమ్మిది వేలు ఇవ్వాలని సిఐటియు సీనియర్ నాయకులు కె.శ్రీనివాసు, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.పార్వతీశం, ఆదినారాయణ మూర్తి డిమాండ్ చేశారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ అసోసియేషన్ ఆధ్వర్యాన నగరంలోని జ్యోతిరావుపూలే పార్కు వద్ద ఐదు రోజుల పాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 75 లక్షల మంది ఇపిఎస్ పెన్షనర్లు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని, వారిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. సుమారు 80 శాతం మందికి రూ.రెండు వేలకు మించి పెన్షన్ రావడం లేదని, రూ.వెయ్యి లోపు పెన్షన్ తీసుకుంటున్న వారు లక్షలాది మంది ఉన్నారని చెప్పారు. పెరుగుతున్న ధరలు, వృద్దాప్యంలో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలకు పెన్షన్ సరిపోక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇపిఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.మూడు వేలు, కరువుభత్యం ఇస్తామని 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి ప్రకటించిందని గుర్తుచేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా ఆ హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. ఇపిఎస్ పెన్షన్ కార్పస్ ఫండ్ సుమారు రూ.ఏడు లక్షల కోట్లు ఉందని, దానిపై వడ్డీ రూ.51 వేల కోట్లు వచ్చిందని చెప్పారు. అందులో 25 శాతం మాత్రమే పెన్షన్ కోసం వెచ్చిస్తున్నారని తెలిపారు. 2014 తర్వాత ఉద్యోగంలో చేరిన వారు సిపిఎస్ పరిధిలోకి వస్తారని, దీనివల్ల భవిష్యత్లో ఇపిఎస్ పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్ల సంఖ్య తగ్గుతుందన్నారు. అందువల్ల ఎటువంటి భారం లేకుండా పెన్షన్ పెంపునకు వీలుందన్నారు. వృద్ధులకు గతంలో ఇచ్చిన రైల్వే రాయితీని పునరుద్ధరించాలని, పెన్షన్ లెక్కింపులో ప్రొరేటా పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలకు ఉపాధ్యాయ సంఘ నాయకులు బొనిగి భాస్కరరాఉ, ఎపిఆర్పిఎ నాయకులు బి.జనార్థనరావు సంఘీభావం తెలిపారు.