ప్రజాశక్తి-విజయనగరం : నగరంలోని విజ్జి స్టేడియంలో పోలీసు శాఖకు విజయనగరం కింగ్స్, పార్వతీపురం మన్యం పోలీసుశాఖకు చెందిన పార్వతీపురం పయనీర్స్ మధ్య ఆదివారం 30న క్రికెట్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. నిరంతర విధులు, ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు ఎస్పి ఎం.దీపిక ఆధ్వర్యాన విజయనగరం కింగ్స్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పి విక్రాంత్పాటిల్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు క్రికెట్ పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొని, క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ నిరంతరం విధులు నిర్వహిస్తూ, ఎంతో ఒత్తిడి గురయ్యే పోలీసులకు పోటీలు నిర్వహించి క్రీడా స్ఫూర్తిని నింపారన్నారు. టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకున్న విజయనగరం కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లును కోల్పోయి 147 పరుగులు సాధించారు. 148 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగు ప్రారంభించిన పార్వతీపురం పయనీర్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 149 పరుగురు చేసి విజయం సాధించింది. ముగింపు వేడుకల్లో ఇరు జిల్లాల ఎస్పిలు మాట్లాడారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా సమిష్టిగా పని చేసి, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని పోలీసు అధికారులను, సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో పలువురు డిఎస్పిలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.