మాట్లాడుతున్న గోవిందరావు
ప్రజాశక్తి- మెళియాపుట్టి
జిల్లాలో ఐటిడిఎను ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేశారు. స్థానిక్ట సిపిఎం కార్యాలయంలో సిపిఎం నాయకులు కె.సూరయ్య అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్లో చేర్చాలన్నారు. ఐటిడిఎ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు ఎక్కడెక్కడ వారో వచ్చి తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వం అండతో భూములు గుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో గిరిజన భూ సమస్యను ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అడవులను కొండలను కార్పొరేట్ సంస్థకు ధారాదత్వం చేయడానికి పూనుకుందన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. 2007లో ప్రారంభించిన ఆఫ్షోర్ రిజర్వాయరు 17 ఏళ్లు కావస్తున్నా… 13 కిలోమీటర్ల కాలువ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నీరు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. సమావేశంలో సిపిఎం నాయకులు హనుమంతు ఈశ్వరరావు, డి.దామోదరరావు, కె.నారాయణరావు పాల్గొన్నారు.