ఏటీఎం సీసీ కెమెరాలపై స్ప్రే చేసి రూ.25 లక్షలు చోరీ

రుద్రూర్‌: నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండల కేంద్రంలో బస్టాండ్‌ సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి రూ.25 లక్షలు దోచుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి బలెరో వాహనంలో నలుగురు దుండగులు మాస్కులు ధరించి వచ్చారు. అక్కడ తమ ఫుటేజ్‌ రికార్డు కాకుండా ఇరువైపులా ఉన్న సీసీ కెమెరాలపై స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎంను ధ్వంసం చేసి రూ.25 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఏటీఎం విడిభాగాలను బయట పడేశారు. సమాచారం తెలుసుకున్న రుద్రూర్‌ సీఐ జయేశ్‌ రెడ్డి, బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌, పోలీసు సిబ్బంది, క్లూస్‌ టీమ్‌ వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు.

➡️