ఎస్‌టీయు జిల్లా కమిటీలో ఆదోని నాయకులకు చోటు

Dec 11,2023 15:51 #Kurnool

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఎస్‌టీయు జిల్లా క‌మిటీలో ఆదోని పట్టణ నాయకులకు చోటు ద‌క్క‌డం హ‌ర్ష‌నీయ‌మ‌ని పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రవి, ఎస్.భీమరాజు అన్నారు. సోమ‌వారం ఆదోనిలోని ఎస్‌టీయు కార్యాల‌యంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర కౌన్సిలర్స్ సి నాగరాజు, లోక్య నాయక్, జి వీరచంద్ర యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడుగా వి రమేష్ నాయుడు, జిల్లా కార్యదర్శిగా ఎంబి.కల్యాణి ఎన్నికయ్యారని తెలిపారు. ఎన్నికైన రాష్ట్ర కౌన్సిలర్స్ సి.నాగరాజు, ఎస్.లోక్య నాయక్,జి.వీరచంద్ర యాదవ్,జిల్లా ఉపాధ్యక్షుడు వి.రమేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్స్ సమస్యల సాధనకు సూసైడ్ పరిష్కారం కాదని, సమస్యలు పరిష్కరించకుంటే రాబోవు ఎన్నికల్లో బుద్ది చెబుదామని తెలిపారు. అనంతపురం జిల్లా ఉపాధ్యాయుడు మల్లేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎన్నికల ముందు సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ ఇస్తామని, మెరుగైన, పీఆర్సీ సకాలంలో డీఏలు చెల్లిస్తామని, బకాయిలు ఉండవని ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంటుందని ఎన్నో హామీలు ఇచ్చారని అన్నారు. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాక పోగా సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించాలని రోడ్ల మీదకు వచ్చే స్థితిని, సూసైడ్ చేసుకోవాలన్న పరిస్థితిని ప్రభుత్వమే కల్పించిందని ఆరోపించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని తెలిపారు.

➡️