ప్రజాశక్తి-ప్రకాశం : ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో 16 విభాగాలకు సంబంధించి నోడల్ అధికారులను జిల్లా, నియోజక వర్గ స్థాయిలో నియమించడం జరిగిందని, సంబంధిత నోడల్ అధికారులు వారికి కేటాయించిన ఎన్నికల విధులను పూర్తిగా అవగాహన చేసుకొని విధులు నిర్వర్తించాలన్నారు. గురువారం ఉదయం కొండపి తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్ను సందర్శించి, నియోజక వర్గ స్థాయి నోడల్ అధికారులతో సమావేశమై సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎం సి సి., ఎస్ఎస్టి, ఎఫ్ఎస్టి, విఎస్టి, వివిటి, అకౌంట్స్, పిర్యాదులు, రిపోర్ట్స్, మేనేజ్మెంట్ తదితర టీమ్స్ నోడల్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉందని, నోటిఫికేషన్ విడుదలయిన నాటి నుంచి ఎం.సి.సి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇందుకు తగిన విధంగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నోడల్ అధికారులు ఎన్నికల జారీ చేసిన మార్గదర్శకాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఎన్నికల నియమావళిని అమలు చేసేలా సంసిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎఫ్.ఎస్.టి., వివిటి., ఎస్ఎస్టి., విఎస్టి తదితర టీమ్ లను విధులు చాలా కీలకమన్నారు. నోడల్ అధికారులు ఎన్నికల నియమావళి పై అవగాహన చేసుకొని ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన సమయం నుండి కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా సచివాలయాల పరిధిలో వి. ఆర్.ఓ., మహిళా పోలీసు పాత్ర చాలా ముఖ్యం అని, వి. ఆర్ ఒలు., మహిళా పోలీసు లు నోడల్ అధికారులకు అందుబాటులో ఉండి ఎన్నికల విధులకు బాధ్యతతో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. తొలుత కొండపి మండలం, గోగినేనివారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాటశాలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని తనికీ చేసి పోలింగ్ సందర్భంగా చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్ల ను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ శౌర్య మన్ పటేల్, అడిషనల్ ఎస్పీ శ్రీధర్ రావు, కొండపి నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి కుమార్, విశ్వేశ్వర రావు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ .నియోజక వర్గానికి సంబందించిన సెక్టార్ ఆఫీసర్స్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.