ఎంపి గురుమూర్తికే తిరుపతి బాధ్యతలు ప్రజాశక్తి -తిరుపతి టౌన్: తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జి వైసిపి వెనకడుగు వేసింది. గత జాబితాలో సిట్టింగ్ ఎంపి గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా నియమించి అక్కడి ఎంఎల్ఏ ఆదిమూలానికి పార్లమెంట్ బాధ్యతలు అప్పగించింది. ఆదిమూలం టిడిపిలో చేరడానికి సిద్ధం కావడంతో గురుమూర్తినే తిరిగి తిరుపతి ఇన్ఛార్జ్ గా నియమించింది. జీడీనెల్లూరుకు చెందిన నూకతోటి రాజేశ్ను సత్యవేడు ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఆయన పెద్దిరెడ్డి అనుచరుడు. నూక తోటి రాజేష్ మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ అల్లుడు కావడం విశేషం. రెండు రోజుల క్రితం ‘ప్రజాశక్తి’ లో నూక తోటి రాజేష్ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పరిశీలించారని ప్రచురించారు. తర్వాత అనూహ్యంగా సత్యవేడు వైసిపి ఎమ్మెల్యే ఆదిమూలం టిడిపి యువనేత నారా లోకేష్ ను కలవడంతో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తిని ఎంపీగా పంపడానికి అధిష్టానం ఓకే చెప్పింది.