ఉల్లి ఎగుమతులపై నిషేధం పొడిగింపు

Mar 23,2024 22:02 #Business

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించింది. గతేడాది డిసెంబర్‌లో మార్చి 31 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఉల్లి ఎగుమతుల్లో భారత్‌ అతిపెద్ద దేశంగా ఉంది. నిషేధం తర్వాత ఉల్లి ధరలు కొంత తగ్గాయి. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం అమలులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాగా ప్రస్తుత సీజన్‌లో ఉల్లి ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తారని వ్యాపారులు ఊహించారు. తాజా నిర్ణయంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా ఉల్లి ఉత్పత్తి జరుగుతుంది. ఎగుమతి ఆంక్షలతో అక్కడ 2023 డిసెంబర్‌లో క్వింటాల్‌ ఉల్లి ధర రూ.4,500 నుంచి రూ.1,200 పడిపోయింది.

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉల్లి ఎగుమతులపై నిషేధం ప్రకటించకపోతే.. అధిక ధరలతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావించాయని సమాచారం. బంగ్లాదేశ్‌, మలేషియా, నేపాల్‌, యుఎఇ దేశాలు భారత్‌ నుంచి అధిక ఉల్లి దిగుమతులు చేసుకుంటున్నాయి. 2022ా23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ రికార్డు స్థాయిలో 2.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేసింది.

➡️