ప్రజాశక్తి- సింగరాయకొండ (ప్రకాశం జిల్లా): పిజి చదివినా ఉద్యోగం రాలేదని ఓ యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సింగరాయకొండ రైల్వేస్టేషన్లో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం, ఎడ్లూరుపాడు గ్రామానికి చెందిన దళిత యువతి పోకూరి కుసుమ (27) పుట్టుకతోనే వికలాంగురాలు. చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని మానసిక వేదనకు గురయ్యేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు సింగరాయకొండ రైల్వే స్టేషన్కు వచ్చారు. కృష్ణా ఎక్స్ప్రెస్ కింద పడేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో ఆ తర్వాత వచ్చిన గూడ్స్బండి కింద పడ్డారు. పోలీసులు అప్రమత్తమై రైలును నిలుపుదల చేసి పరిశీలించగా..అప్పటికే ఆమె తల, మొండం రెండుగా విడిపోయి మరణించారు. పిజి వరకు కష్టపడి చదువుకుందని, ఉద్యోగం రాలేదని మానసికంగా ఆలోచిస్తూ ఉండేదని, ఇలా చేస్తుందని అనుకోలేదని తండ్రి రామయ్య బోరున విలపించారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.