ప్రజాశక్తి – బిక్కవోలు
బలభద్రపురం శివారు కానేడు గ్రామంలో గల గ్లూకోజ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని ప్రారంభించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని బిక్కవోలు తహశీల్దార్ కార్యాలయం వద్ద గ్లూకోజ్ ఫ్యాక్టరీ కార్మికులు శుక్రవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు నాగేశ్వరరావు మాట్లాడారు. గుజరాత్కు చెందిన బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గ్రామంలో ఫ్యాక్టరీని నిర్మించిందన్నారు. ప్రస్తుతం సంస్థ యాజమాన్యం అక్రమ లే ఆఫ్ పేరుతో పరిశ్రమలో ఉత్పత్తిని నిలిపేసిందన్నారు. 30శాతం జీతం ఇస్తూ 80 రోజులుగా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఈనెల 22 తరవాత పరిశ్రమను మూసేస్తామని చెప్పి కార్మికులన బయటకు పంపేసిందన్నారు. ఇతర రాష్ట్రం నుంచి కార్మికులను తీసుకొచ్చి ఫ్యాక్టరీలో పనిచేయించుకోవాలని చూస్తుందన్నారు. ఇది చాలా దారుణమన్నారు. తమకుఏ న్యాయం చేయాలని కోరారు. ఈ రిలే నిరాహార దీక్షకు ఆశా వర్కర్లు, అంగనవాడీలు మద్దతు తెలిపారు.