ఇష్టం లేని పెళ్లి చేశారని బాలిక ఆత్మహత్య

హైదరాబాద్‌ : చిన్నప్పటి నుంచి కని పెంచి అల్లారు ముద్దుగా చూసుకునే తన కూతురు బలవంతం మరణానికి ఆ తల్లిదండ్రులే కారకులయ్యారు. పెండ్లి చేస్తే తమ కూతురు బాగుంటుందో అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. 14 ఏళ్ల బాలికకు ఇష్టంలేని పెండ్లి చేసిన తల్లిదండ్రులకు విషాదమే మిగిలించింది. కుటుంబ పెద్దల నిర్ణయాలతో ఓ మైనర్‌ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లా టేక్మాల్‌ లో చోటుచేసుకుంది. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. తన 14ఏళ్ల కూతురుకి తన మేనబావతోనే పెండ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్దమయ్యారు. అయితే ఆపెండ్లి తనకు ఇష్టం లేదని చేసుకోనని చెప్పిన వారు వినిపించుకోలేదు. మేనబావతోనే నీ పెండ్లి చేస్తామని చివరకు ఈనెల 4న వివాహం చేశారు. తనకు ఇష్టం లేకపోయినా చివరకు ఆ బాలిక తల వంచి తాళి అయితే కట్టించుకుంది. చిన్నవయసులో బలవంతంగా పెండ్లి చేశారనే మనస్తాపంతో బాత్‌ రూమ్‌ లోకి వెళ్లిన బాలిక బయటకు రాలేదు. అయితే ఎంత సేపటికి బాలిక బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు తట్టినా మాట వినపడలేదు.. దీంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా చున్నీతో ఉరివేసుకుని బాలిక కనిపించింది. దీంతో అందరూ షాక్‌ లో ఉండిపోయారు. కుటుంబంలో ఒక్కసారిగా మనోవేదన మిగిలింది. ఇష్టంలేదని చెప్పిన కన్న బిడ్డ గొంతుకోసామని కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పుడు కన్న కూతురు మాట వినివుంటే ఇప్పుడు తనని పోగొట్టుకునే వారము కాదంటూ గుండెలు బాదుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇష్టం లేని పెండ్లి చేసుకున్న బాలిక 9 రోజుల తరువాత ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అత్తవారింట్లో ఏమైనా జరగిందా? అనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

➡️