ఫొటో : స్పందనలో వినతిపత్రం అందజేస్తున్న సిపిఐ నాయకులు
ఆక్రమణ నుండి దోరువును కాపాడాలి
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన పంచాయతీ దొరువును ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని సిపిఐ రైతు సంఘం నాయకులు ఎస్కె షాన్వాజ్ తెలిపారు. సోమవారం స్పందన సందర్భంగా నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో సిపిఐ నాయకులతో కలిసి దోరువును ఆక్రమణ చెర నుంచి విడిపించాలని ఫిర్యాదును అందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని సోమరాజుపల్లి పంచాయతీ నర్సాపురం గ్రామానికి చెందిన పంచాయతీ దోరువు సర్వేనెంబర్ 163/1, 164/1 లో 1.10 సెంట్ల దోరువు గతంలో ఉండేదని కాలక్రమేణా కొందరు అక్రమార్కులు దోరువును ఆక్రమిస్తూ వస్తున్నారని తెలిపారు. దానిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినా కూడా ప్రయోజనం లేదని వాపోయారు. ఒక ఎకరా 10సెంట్లు స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అధికారులు అండతో కబ్జా చేస్తున్నారని వాపోయారు. పంచాయతీ దోరువు స్థలానికి అధికారులు ఎల్పిఎం నెంబర్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎల్పిఎం నెంబర్తో రిజిస్ట్రేషన్కు కూడా సదరు కబ్జాదారుడు పాల్పడుతున్నాడని, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. సదరు స్థలాన్ని ఉన్నతాధికారులు చొరవ తీసుకొని అడంగల్ నుండి తొలగించాల్సిందిగా కోరుతున్నామన్నారు. సదరు ఆక్రమిత దోరువులో నూతనంగా నిర్మిస్తున్న అనుమతులులేని కట్టడాన్ని కూడా డమాలిష్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చీమకుర్తి శ్రీనివాసులురెడ్డి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.