అభివృద్ధి అంటే టిడిపికి తెలుసా?

Dec 8,2023 20:30

  ప్రజాశక్తి-మెరక ముడిదాం :   ‘అభివృద్ధి అంటే ఏమిటో టిడిపికి తెలుసా? ఎపుడైనా, ఏ పంచాయతీలో నైనా ఒక పది మందికి ఉద్యోగాలు వేసారా? అమరావతిలా గ్రాఫిక్స్‌ చూపించటం, మాయ మాటలు చెప్పటం కాదు అభివృద్ధి అంటే’ అంటూ టిడిపిపై జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు విరుచుకు పడ్డారు. శుక్రవారం గాదెల మర్రివలస పంచాయతీలో సుమారు కోటి రూపాయలతో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ క్లినిక్‌ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం అనేది ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని అన్నారు. గాదెల మర్రివలస గ్రామంలో 668 గడపకు సుమారు పదహారున్నర కోట్ల రూపాయలు పారదర్శకంగా లబ్ది దారులకు వారి ఖాతాల్లో వేయటం జరిగిందని తెలిపారు. అర్హులైన వారికి 332 పెన్షన్లు ఇచ్చామన్నారు. రూ.3.50లక్షలతో కల్వర్టు నిర్మించామన్నారు. బద్నాయుడు వలస నుండి గాజుల రామచంద్రపురానికి తారు రోడ్డు వేశామన్నారు. కోటి రూపాయలతో ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌ కూడా త్వరలో ఇస్తామని తెలిపారు. కార్యక్రమం లో మాజీ ఎంపిపి తాడ్డి వేణుగోపాలరావు, గ్రామ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ దేవ, నారాయణరావు, గొట్టిపల్లి సర్పంచ్‌ సుంకరి రమేష్‌, పులిగుమ్మి సర్పంచ్‌ తల చుట్ల ఈశ్వరరావు, బూర్లె నరేష్‌ కుమార్‌, కర్రోతు నాగేశ్వరరావు, ఎంపిడిఒ రత్నం, తదితరులు పాల్గొన్నారు.

➡️