ప్రజాశక్తి-అమరావతి : గత అయిదేళ్లుగా సిఎం జగన్ సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే… అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, విమర్శించారు. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని ముఖ్యమంత్రి… అప్పులు తేవడంలో మాత్రం పిహెచ్డి చేశారన్నారు. ఈ మేరకు లోకేశ్ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. ”రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని రూ.370 కోట్లకు జగన్ తాకట్టుపెట్టారు. ఖనిజ సంపద తనఖాతో రూ.7వేల కోట్లు.. మందుబాబులను తాకట్టుపెట్టి రూ.33వేల కోట్ల అప్పులు తెచ్చారు. ఆయన పాలనలో ఇక మిగిలింది 5 కోట్ల మంది జనం మాత్రమే. ఇప్పటికీ తాను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదరగొడుతున్న జగన్ మాటల వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గుర్తించాలి. రానున్న 2 నెలలు ఆయనతో జాగ్రత్తగా ఉండాలి” అని లోకేష్ పేర్కొన్నారు.