రోబోటిక్స్ ను పరిశీలిస్తున్న వీసి ప్రొఫెసర్ రాజశేఖర్, తదితరులు
ప్రజాశక్తి – ఎఎన్యు : రోబోటిక్స్ రంగానికి ప్రాధాన్యం పెరిగిన తరుణంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రోబోటిక్స్ క్లబ్ను ప్రారంభించనున్నట్లు వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ పి.రాజశేఖర్ తెలిపారు. వర్సిటీలోని డాక్టర్ వైఎస్ఆర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో రోబోటిక్స్పై రెండ్రోజుల వర్క్షాప్ బుధవారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ రోబోటిక్స్ రంగంలో అపార ఉపాధి అవకాశాలున్నాయని చెప్పారు. వర్సిటీలో నూతన కోర్సుల్లో భాగంగా రోబోటిక్స్ కోర్స్నూ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గౌరవ అతిథిగా పాల్గొన్న కంప్యూటర్ పాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ నారంగ్ వివిధ రకాల రోబోట్లను ప్రదర్శించి వాటి నిర్మాణ పనులను, ప్రాధాన్యతను వివరించారు. పరిశ్రమల్లో ఉపయోగించే రోబోట్లపై మరొక అతిథి సుదర్శన్ జయబాలని అవగాహన కల్పించారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ తదితర అంశాల్లో వివిధ రకాల ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇంజినీరింగ్ కోర్సుల డీన్ ప్రొఫెసర్ ఇ.శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిద్ధయ్య, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గంగాధరరావు, విభాగాధిపతి బాలాజీ, అధ్యాపకులు సతీష్ కుమార్, చైతన్య పాల్గొన్నారు.