ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు ఇద్దరు మావోయిస్టులు మృతి

Mar 17,2024 21:42 #Chhattisgarh, #death, #firing, #mavoist

ప్రజాశక్తి – చింతూరు, పెదబయలు (అల్లూరి జిల్లా) : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అడవుల్లో ఆదివారం ఉదయం తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదుర్పు కాల్పుల్లో మావోయిస్టు ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెగ్మటా అటవీ ప్రాంతంలో సుమారు 25 మంది మావోయిస్టులు సమావేశమైనట్టు పోలీసు ప్రత్యేక భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో వారు కూంబింగ్‌ నిర్వహించారు. మావోయిస్టులు ఎదురుపడడంతో పోలీసులు కాల్పులు మొదలుపెట్టారు. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ ఇంద్రావతి ఏరియా కమిటీ కమాండర్‌ మల్లేష్‌, మాద్‌ డివిజన్‌ కమిటీ కమాండర్‌ అరుణ్‌ అలియాస్‌ రూపేష్‌ మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. మిగిలిన మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. కాల్పులు చోటుచేసుకున్న ప్రదేశంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

➡️