సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకులు
- ఎన్నికల పరిశీలకులు కోమల్జిత్ మీనా, శరవణ కుమార్
ప్రజాశక్తి – శ్రీకాకుళం
ఎన్నికల వ్యయ పరిశీలనను పారదర్శకంగా చేపట్టాలని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు కోమల్జిత్ మీనా, శరవణ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బు, మద్యం వంటి ప్రలోభాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నిఘా కోసం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టి బృందాలను కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పుడూ పర్యవేక్షించాలని చెప్పారు. నిఘా బృందాలకు సిసి కెమెరాలు, జిపిఎస్ ట్యాగ్ సిస్టమ్ అమర్చిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సి-విజిల్, 1950 టోల్ ఫ్రీ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి తీకుంటున్న చర్యల గురించి అడిగారు. ప్రచార ఖర్చును అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రత్యేక పరిశీలన బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, నోడల్ అధికారులు సిపిఒ ప్రసన్నలక్ష్మి, జిల్లా ఆడిట్ అధికారి సుల్తానా, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్డిఎ పీడీ కిరణ్ కుమార్, డిసిసిబి సిఇఒ వరప్రసాద్, నీటిపారుదల శాఖ ఎస్ఇ పొన్నాడ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.