- విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో రోగి సహాయకుడి ఘాతుకం
ప్రజాశక్తి- విజయనగరం కోట : విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మంగళవారం రాత్రి ఓ ట్రైనీ నర్సుపై రోగి సహాయకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఆస్పత్రి ఆర్ఎంఒ రాజు, వన్టౌన్ సిఐ బి.వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం… గంట్యాడ మండలం పెంటశ్రీరాంపురానికి చెందిన గంధవరపు గోపి (33) అనారోగ్యం పాలైన తన తల్లిని ఆస్పత్రిలో చేర్పించాడు. వారం రోజులుగా ఆస్పత్రిలో తన తల్లికి సహాయకుడిగా ఉంటున్నాడు. విజయనగరంలోని లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో సెకెండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ట్రైనింగ్లో భాగంగా ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో పురుషుల వార్డులో పేషెంట్లకు ఇంజక్షన్ ఇచ్చి మంచినీళ్లు తాగడానికి నర్సుల రెస్ట్ రూము వద్దకు ఆమె వెళ్లారు. రెస్ట్ రూము లోపల గడియ పెట్టి ఉండడంతో తలుపు కొట్టారు. అప్పటికే ఆ రూములో ఉన్న గోపి ఆమె చేయి పట్టుకొని గది లోపలికి లాగి అత్యాచారం చేయబోయాడు. ఊహించని పరిణామంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డు వచ్చి నిందితుడు గోపిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో, ఆయన కిటికీ అద్దాలు పగలగొట్టి ఫర్నిచర్ను చిందరవందర చేశాడు. పారిపోయే క్రమంలో ఆపరేషన్ థియేటర్ అద్దాలు పగులగొట్టాడు. ఈ నేపథ్యంలో గాయపడిన ఆయనను సెక్యూరిటీ గార్డు పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నిందితుడికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. పట్టుబడిన గోపి… తన తల్లికి బాగోలేక ఆస్పత్రికి వచ్చామని, క్షమించి వదిలేయాలని సెక్యూరిటీ సిబ్బందిని వేడుకున్నాడు. మద్యం మత్తులో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వైద్యులు చెబుతున్నారు. గోపిపై కేసు నమోదు చేశామని, కేసు దర్యాప్తులో ఉందని వన్టౌన్ ఎస్ఐ ఎ.నరేష్ తెలిపారు.