కాందహార్ : దక్షిణ ఆఫ్ఘనిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది మరణించగా, 38 మంది గాయపడినట్లు ప్రావిన్షియల్ ట్రాఫిక్ విభాగం తెలిపింది. గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. దక్షిణ కాందహార్, పశ్చిమ హెరాత్ ప్రావిన్సుల మధ్య హెల్మాండ్ ప్రావిన్స్లోని గెరాష్క్ జిల్లాలోని ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని హెల్మండ్లోని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది.
కాందహార్ నుండి హెరత్ ప్రావిన్స్కు వెళుతున్న బస్సును ఓ మోటార్ బైక్ ఢీ కొట్టింది. దీంతో అదుపుతప్పిన బస్సు ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్పైకి దూసుకువెళ్లిందని హెల్మాండ్ పోలీస్ చీఫ్ ప్రతినిధి హజ్తుల్లా హక్కానీ తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించామని అన్నారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.