బంగ్లాదేశ్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైలుకు దుండగులు నిప్పు.. 5గురు మృతి

  • పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు మళ్లీ హింస..
  • విచారణకు ఆదేశించిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా

ఢాకా: బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. ప్రయాణికుల రైలుకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత్‌ సరిహద్దుల్లో ఉన్న బెనాపోల్‌ పట్టణం నుంచి బయల్దేరిన బెనాపోల్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఢాకాలోని కమలాపూర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుండగా దుండగులు దాడి చేసి నాలుగు బోగీలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 5గురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఘటన సమయంలో రైల్లో దాదాపు 300 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో అత్యధికులు ఎన్నికల కోసం భారత్‌ నుంచి స్వస్థలాలకు తిరిగొస్తున్నవారేనని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై దేశ ప్రధాని షేక్‌ హసీనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జనవరి 7న దేశవ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ఘటన చోటుచేసుకోవడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.

➡️