రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి.. 13 మందికి గాయాలు

Jan 26,2024 16:10 #Chilakaluripet, #road accident

చిలకలూరిపేట : పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బస్‌స్టాప్‌ వద్ద ఆర్టీసీ బస్సు-ఆటో ఢకొీన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు నాదెండ్ల మండలం అప్పాపురంలో మిర్చి కోతలకు ఆటోలో వస్తున్నారు. అదే సమయంలో మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిలకలూరిపేట వైపు వెళ్తోంది. ఈ క్రమంలో లింగంగుంట్ల బస్‌స్టాప్‌ వద్ద గణపవరం రోడ్డు నుంచి ఒక్కసారిగా ఆటో చిలకలూరిపేట రోడ్డులోకి వచ్చింది. ఇది గమనించిన ఆర్టీసీ డ్రైవర్‌ తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడలేదు. బస్సు కింద పడి ఆటో నుజ్జయింది.

ఆటోలోని కూలీల్లో యాకసిరి హనుమాయమ్మ(60) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్‌తో సహా క్షతగాత్రులైన 14 మంది కూలీలను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపే గన్నవరపు శివపార్వతి (58) మఅతి చెందారు. తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉన్న షేక్‌ హజరత్‌ వలీ (65)ని గుంటూరు తరలించి జీజీహెచ్‌లో చికిత్స అందించేలోపే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో పరిస్థితి విషమంగా ఉన్న గోరంట్ల శివకుమారి (60), సురుగుల కోటేశ్వరమ్మ (60)ను మెరుగైన వైద్యం కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు.డ్రైవర్‌తో సహా గాయపడిన మరో 11 మందికి చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. గాయాలపాలైన వారిలో షేక్‌ సుబాని(ఆటో డ్రైవర్‌), పాలెపు రజని (42), సట్టు పార్వతి (39), షేక్‌ వహీదా (32), బేతంచెర్ల మల్లేశ్వరి (45), పాలెపు శారద (23), ఎస్‌కే జాన్‌ బీ (40), ఎస్‌.కె.ఖాదర్‌ బీ (37), ఎస్‌.కె మహబూబీ (52), ఎస్‌.కె.మస్తాన్‌ బీ(35) ఎస్‌కే బాజీ (14) ఉన్నారు. సంఘటనా స్థలాన్ని చిలకలూరిపేట గ్రామీణ ఎస్సైలు రవి కృష్ణ, బాలకృష్ణ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

➡️