– సుందరం ఫెర్రో ఎల్లాయీస్ కార్మికుల ధర్నా
ప్రజాశక్తి – రాంబిల్లి (అనకాపల్లి) అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సుందరం ఫెర్రో ఎల్లాయీస్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ధర్నాకు దిగారు. సుందరం ఫెర్రో ఎల్లాయీస్ కంపెనీలో పనిచేస్తున్న 62 మంది పర్మినెంట్ కార్మికులను విధుల్లోకి రావొద్దంటూ యాజమాన్యం చెప్పడంతో వారంతా కంపెనీ గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. ధర్నానుద్దేశించి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను అర్ధాంతరంగా తొలగించడం దారుణమన్నారు. వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా విధులకు రావద్దని చెప్పడం సరికాదన్నారు. కంపెనీ యాజమాన్యం తన వైఖరిని మార్చుకుని తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్ట ప్రకారం కార్మికులకు రావాల్సిన ఫుల్ అండ్ సెటిల్మెంట్, గ్రాడ్యూటీ, లీవులు, బోనస్, బకాయి వేతనాలు ఇవ్వాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో రమేష్, భూషణరావు, కృష్ణ, భూషణరావు, తదితరులు పాల్గొన్నారు.