అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించి సమ్మెను ఆపించాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తల్లీబిడ్డలకు ఎదురయ్యే సమస్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ డిసెంబరు 12 నుండి చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ విచ్ఛిన్న ఎత్తుగడలను ఎదుర్కొని కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా నిలబడాలని, పార్టీలకు అతీతంగా అన్నివర్గాల తరగతుల ప్రజలు, ప్రజాతంత్రవాదులు అంగన్‌వాడీలకు సంఘీభావంగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో అంగన్‌వాడీలకు తెలంగాణలో ఇస్తున్న వేతనం కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని వాగ్ధానం చేసి, ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌ మాట తప్పారని విమర్శించారు. కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పెంచి, పెన్షన్‌ 50 శాతం అమలు చేయాలనే కనీస కోర్కెలు అమలు కోసం నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. కార్మికులు దశలవారీ అనేక రూపాల్లో ఆందోళనల తరువాత విసిగి వేసి చిట్టచివరకు సమ్మెకు దిగారని వివరించారు. ఈ సమ్మెను నివారించే అవకాశం ఉన్నా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేకచోట్ల ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగులు అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులకొట్టి చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకుంటు న్నారని తెలిపారు. కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాధ్యాతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, అంగన్‌వాడీలపై నోరుపారేసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్నిచోట్ల వైసిపి కార్యకర్తలు టెంట్లు పీకేస్తున్నారని ఆగ్రహించారు. ఈ చట్ట విరుద్ధ చర్యలను పోలీసులు దగ్గరుండి జరిపిస్తున్నారని, ప్రశాంతంగా సాగుతున్న సమ్మెను శాంతి భద్రతల సమస్యగా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ఈ సమ్మెకు పోలీసులు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని కోరారు. ప్రశాంతంగా జరిగే సమ్మెను అక్రమ పద్ధతుల ద్వారా విచ్ఛిన్నం చేసే ప్రభుత్వ యత్నాలను ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో అంగన్‌వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవచూపి సమ్మెను విరమింపజేయాలని కోరారు.

➡️