న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సోమవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని భారత వాతావరణశాఖ మంగళవారం తెలిపింది. రానున్న రెండు మూడు రోజుల్లో ఢిల్లీలో ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు చేరుకోనుందని, దీంతో ఆ రాష్ట్రంలో విపరీతమైన వేడి వాతావరణం ఉండనుందని ఐఎండి పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 15.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది సీజన్ సగటు కంటే ఒక డిగ్రీ తక్కువ. ఆ రాష్ట్రంలో తేమ శాతం 40 నుంచి 94 శాతం వరకు ఉంటుందని ఐఎండి తెలిపింది. అలాగే మంగళవారం పలు రాష్ట్రాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్లలోని ఉప- హిమాలయ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.