తప్పుదారి పట్టించే ప్రకటనలపై పిఎంఓ ఆదేశాలు
న్యూఢిల్లీ : బాబా రాందేవ్కు చెందిన పతంజలి ఆయుర్వేద్ విషయంలో ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయుష్ ఉత్పత్తుల విషయంలో తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తూ తరచూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదంటూ పతంజలిపై అందిన ఫిర్యాదు విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. పీఎంఓ నుంచి అందించిన ఆదేశాలపై ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ‘పతంజలి’ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలంటూ ఉత్తరాఖండ్ ఆయుష్ విభాగాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ఆయుర్వేదిక్ అండ్ యునాని సర్వీసెస్ డైరెక్టర్కు లేఖను రాసింది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ (అబ్జెక్షనెబుల్ అడ్వర్టయిజ్మెంట్స్) యాక్ట్, 1954ను పతంజలి తరచూ ఉల్లంఘిస్తున్నదంటూ ఆర్టీఐ కార్యకర్త డాక్టర్ కె.వి బాబు గతనెల 15న పీఎంఓకు ఫిర్యాదు చేశారు. దీని తర్వాత పీఎంఓ పతంజలి విషయంలో ఆయుష్కు పై ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. డయాబెటిస్, ఒబేసిటి, థైరాయిడ్, గుండె వ్యాధులకు తమ మందుల విషయంలో తప్పుదారిపట్టించే ప్రకటనలను పతంజలి గతంలో చేసింది.