ఇంటర్నెట్డెస్క్ : ప్రముఖ కోలీవుడ్ స్టార్ సూర్య తన అభిమానులకు ప్రత్యేక విందు ఇచ్చారు. అభిమానుల కోసం ఎందుకు ప్రత్యేక విందు ఇచ్చారంటే.. గతేడాది డిసెంబర్లో మిగ్జాం తుఫాను వల్ల తమిళనాడు అతలాకుతలమైంది. ఈ తుఫాను వల్ల ఎంతోమంది ఇబ్బందిపడ్డారు. ఆ సమయంలో పలువురు కోలీవుడ్ స్టార్లు బాధితులకు అండగా నిలిచారు. అలాగే వాళ్ల అభిమానుల్ని కూడా తుఫాను బాధితులకు సాయం చేయమని కోరారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ సూర్య కూడా తుఫాను బాధితుల కోసం రూ. 10 లక్షల రూపాయల సాయాన్ని ప్రకటించడమే కాక, ఆ సమయంలో తన అభిమానులను కూడా సాయం చేయమని కోరారు. దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సూర్య అభిమానులు బాధితులకు భోజనాలు పెట్టారు. పలు సేవా కార్యక్రమాలు చేశారు. వారి సేవలను గుర్తించిన సూర్య అభిమానుల కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేసి.. స్వయంగా దగ్గరుండి తనే వడ్డించారు కూడా. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారాయి.