చెరకు ధర : స్వామినాథన్‌ సిఫార్సుల మాటేమిటి ?

Feb 28,2024 07:10 #Editorial

స్వామినాధన్‌కు భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఆయన సూచించిన పద్ధతి ప్రకారం మద్దతు ధరలను నిర్ణయిం చేందుకు మొరాయిస్తున్నది. ఉదాహరణకు చెరకు సంగతే చూద్దాం. 2023లో కేంద్రం ప్రకటించిన ఎఫ్‌ఆర్‌పి రూ.315 (దానికి తాజాగా వచ్చే ఏడాదికి మరో 25 పెంచింది), వివిధ రాష్ట్రాలలో ప్రకటించిన సలహా ధరలు, స్వామినాధన్‌ పద్ధతిలో ఉండాల్సిన ధర, ఒక క్వింటాలకు (రూ.315 ఎఫ్‌ఆర్‌పి ప్రకారం) రైతులు నష్టపోతున్నారని ఆలిండియా కిసాన్‌ సభ పేర్కొంటోంది.

                   కేంద్ర ప్రభుత్వం తాజాగా క్వింటాలు చెరకు ధరను రూ.25 పెంచింది. దీంతో 2024-25 సీజన్‌కు రూ.340కి చేరిందని, రైతులకిచ్చిన ఈ బహుమతితో పండగ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మన దేశంలో సీజన్‌ అంటే ఆర్థిక సంవత్సరానికి చెప్పే నిర్వచనం వేరు, పంటలకు వేరు. ఏప్రిల్‌ నుంచి మార్చి నెల వరకు ఆర్థిక సంవత్సరం. అదే పత్తి, చెరకు సంవత్సరాలు అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు లెక్కిస్తారు. దీని ప్రకారం 2024-25 సీజన్‌ అంటే ఈ ఏడాది అక్టోబరు నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు. కనుక ప్రకటించిన పెంపుదల వర్తమాన సంవత్సరానికి కాదు. ఈ ఏడాది ధరను సీజనుకు ముందుగా గతేడాది జూన్‌లోనే ప్రకటించారు. త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న పూర్వరంగంలో నాటకీయ పద్ధతిలో కేంద్ర మంత్రివర్గం ఫిబ్రవరి 21 సమావేశం, దానిలో చెరకు ధర పెంపు నిర్ణయాన్ని నరేంద్ర మోడీ వెల్లడించారు.

న్యాయమైన, గిట్టుబాటు ధర (ఎంఆర్‌పి) పేరుతో చేస్తున్న జిమ్మిక్కుతో రైతులకు ఒరిగేదేమిటి? షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా క్వింటాలుకు 10.25 శాతం పంచదార దిగుబడి వస్తేనే ఈ ధర దక్కుతుంది. ప్రస్తుత సీజన్‌లో 2023-24కు రూ.315గా 2023 జూన్‌లో కేంద్రం ప్రకటించింది. వచ్చే ఏడాది నిర్ణీత ప్రామాణిక శాతానికి మించి ఎక్కడైనా పంచదార దిగుబడి పెరిగితే 0.1 శాతానికి రూ.3.32 అదనంగా చెల్లిస్తారు. అదే మాదిరి తగ్గితే తగ్గుతుంది. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత 2014-15 నుంచి ఈ మాదిరి పెరుగుదల లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పుకున్నది నిజమే. పదేళ్ల వివరాలను చూసినపుడు చెరకు ధరను రూ.220 నుంచి రూ.315కు పెంచారు. అంటే పదేళ్లలో పెరిగింది కేవలం రూ.95 మాత్రమే. ఏడాదికి సగటు పెంపు రూ.9.50 మాత్రమే. అలాంటిది ఏకంగా రూ.25 పెంచారంటే ఎన్నికల కోసమే అంటే తప్పేముంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ రైతాంగంలో పలుకుబడి కలిగిన ఆర్‌ఎల్‌డి పార్టీ బిజెపితో చేతులు కలిపింది, చెరకు పండేది కూడా అక్కడే ఎక్కువ. ఆర్‌ఎల్‌డి మద్దతుదార్లు ఈ రాజకీయ అవకాశవాదాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని, నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారని వార్తలు వచ్చిన పూర్వ రంగంలో వారిని మచ్చిక చేసుకొనేందుకు మోడీ పూనుకున్నారు.

దేశంలో చెరకు ధరకు రెండు పద్ధతులను అనుసరిస్తున్నారు. ఒకటి కేంద్రం ప్రకటించే ఎఫ్‌ఆర్‌పి కాగా రెండవది కొన్ని రాష్ట్రాలు ప్రకటి స్తున్న రాష్ట్ర సలహా ధర (ఎస్‌ఏపి) సహజంగా కేంద్రం కంటే ఎక్కువగా ఉంటుంది. ఉదాహ రణకు పంజాబ్‌లో రూ.391, ఉత్తర ప్రదేశ్‌లో రూ.370 ఉంది. అందువలన కేంద్రం ప్రకటించిన ధరతో ఎవరికి ప్రయోజనం? ప్రస్తుతం ఉన్న రూ.315 ధర పంచదార దిగుబడి 9.5 శాతం అన్న అంచనాతో నిర్ణయించారు. అందువలన దిగుబడి పెరిగితేనే రైతుకు ఉపయోగం లేకపోతే నష్టమే. దిగుబడి రైతు చేతిలో ఉండదు. ప్రైవేటు రంగంలో ఉన్న ఏ ఒక్క పంచదార ఫ్యాక్టరీ దిగుబడి గురించి వాస్తవ సమాచారాన్ని వెల్లడించదు.

అందువలన దిగుబడితో నిమిత్తం లేకుండా ధర చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రమైనా, రాష్ట్రాలు ప్రకటించే ధరలైనా వాస్తవ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదని, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో సాగు ఖర్చు టన్నుకు రూ.440 అవుతుందని రైతులు చెబుతున్నారు. అందుకే పెంపుదలను ముష్టి విదిల్చినట్లుగా భావిస్తున్నారు. మిల్లు యజమానులు పంచదార, తదితర ఉత్పత్తులను అమ్మిన తరువాతే రైతులకు డబ్బు చెల్లిస్తున్నారు. అంటే రైతుల పెట్టుబడితో మిల్లులు నడుస్తున్నాయి. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్రం లేదా రాష్ట్రాలు చెరకు ధర పెంచటం లేదు. ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ పాలన 2012 నుంచి 2017 వరకు 26 శాతం చెరకు ధర పెంచితే నరేంద్ర మోడీ ‘అచ్చే దిన్‌’, యోగి ‘బుల్డోజర్‌ పాలన’ ఏడు సంవత్సరాల్లో పెంచింది 17.46 శాతమే.

స్వామినాధన్‌కు భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఆయన సూచించిన పద్ధతి ప్రకారం మద్దతు ధరలను నిర్ణయిం చేందుకు మొరాయిస్తున్నది. ఉదాహరణకు చెరకు సంగతే చూద్దాం. 2023లో కేంద్రం ప్రకటించిన ఎఫ్‌ఆర్‌పి రూ.315 (దానికి తాజాగా వచ్చే ఏడాదికి మరో 25 పెంచింది), వివిధ రాష్ట్రాలలో ప్రకటించిన సలహా ధరలు, స్వామినాధన్‌ పద్ధతిలో ఉండాల్సిన ధర, ఒక క్వింటాలకు (రూ.315 ఎఫ్‌ఆర్‌పి ప్రకారం) రైతులు నష్టపోతున్నారని ఆలిండియా కిసాన్‌ సభ పేర్కొంటోంది.

ఈ పూర్వరంగంలో క్వింటాలకు రూ.500 ధర నిర్ణయించాలని అఖిల భారత కిసాన్‌ సభ డిమాండ్‌ చేసింది. సహకార, ప్రభుత్వ రంగంలో ఉన్న పంచదార మిల్లులను జాతీయం చేయరాదని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కూడా కోరింది. వర్తమాన సంవత్సరంలో రూ.315 అంటే దిగుబడిలో 10.25 శాతం దాటిన తరువాత పెరిగే ప్రతి 0.1 శాతానికి అదనంగా రూ.3.07 చెల్లిస్తారు, తగ్గితే ఆ మేరకు కోత పెడతారు. సగటు దిగుబడి 9.5 శాతమే ఉన్నందున క్వింటాలు ధర రూ.315గా చెప్పినా రైతుకు దక్కేది రూ.292 మాత్రమే. చెరకు ఉత్పత్తి ఖర్చుకు వంద శాతానికి మించి గిట్టుబాటు ధర చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం నమ్మబలుకుతోంది. అసలు కిటుకు అక్కడే ఉంది. క్వింటాలుకు సాగు ఖర్చును కేవలం రూ.157 మాత్రమే 2023-24 సంవత్సరానికి లెక్కగట్టి రూ.315 ప్రకటించామంటే రెట్టింపే కదా అని చెబుతున్నారు.

రైతులు మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా? ప్రభుత్వం చెబుతున్నది వ్యవసాయ పంటల ధరల నిర్ణాయక సంస్థ సూచించిన మొత్తం. అది వాస్తవ సాగు ఖర్చును పరిగణనలోకి తీసుకోవటం లేదని ప్రారంభం నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అందుకే స్వామినాధన్‌ కమిషన్‌ పద్ధతి ప్రకారం సాగు ఖర్చును, మద్దతు ధరలను నిర్ణయించాలని, వాటికి చట్టబద్దత కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో ఏడాది పాటు చేసిన ఉద్యమం, తాజాగా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారు కూడా కోరుతున్నది అదే.

ఎం. కోటేశ్వరరావు
ఎం. కోటేశ్వరరావు
➡️