హసన్పర్తి (హన్మకొండ) : ఈనెల 6వ తేదీ సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో బీటెక్లో చేరిన మూడు నెలలకే రేణుశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనాన్ని రేపింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. అయితే తాజాగా … మరో విద్యార్థిని సూసైడ్ ఘటన వెలుగుచూసింది.
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అన్నసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో రాథోడ్ దీప్తి అనే విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీప్తి యూనివర్సిటీలో అగ్రికల్చర్ చదువుకుంటుంది. సంక్రాంతి సెలవులు కావడంతో … అందరూ ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉన్నారు. ఇంతలో… తమ స్నేహితురాలు తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం చూసి స్నేహితులంతా షాకయ్యారు. వెంటనే యూనివర్సిటీ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోంచి దర్యాప్తు చేపట్టారు.