విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ
ప్రజాశక్తి- మక్కువ (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సీదరపు అశోక్ (15) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. శనివారం స్థానిక ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ పుష్పనాదం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అశోక్ గురువారం రాత్రి నుంచి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో, ఆయనను అదే రోజు శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఎనిమియా ఉన్నట్లు నిర్ధారించి ఇంజక్షన్తో కూడిన బాటిల్ ఇచ్చి పంపేశారు. శుక్రవారం రాత్రి సుమారు 9.30 గంటల ప్రాంతంలో శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతుండడంతో హాస్టల్ వార్డెన్ చందర్రావు 108 వాహనంలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి అశోక్ మృతి చెందాడు. ఆ విద్యార్థి మృతదేహాన్ని శనివారం స్వస్థలమైన పాచిపెంట మండలం కారాడవలసకు తరలించారు. అనారోగ్యంతో మరో ఇద్దరు విద్యార్థులుఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో ప్రస్తుతం మరో ఇద్దరు విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. యు.సంజరు, జి.సంతోష్ కుమార్ ప్రస్తుతం జ్వరంతో బాధపడుతుండగా, వారికి అన్ని విధాలా ఆరోగ్య సేవలందించినట్లు వార్డెన్ చందర్రావు తెలిపారు. ప్రస్తుతం హాస్టల్లో 260 మంది విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. సరైన వైద్యం అందనందునే మృతి అనారోగ్యంతో అశోక్ మరణించడంపై విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.పండు, సాలూరు మండల కార్యదర్శి టి.అఖిల్ డిమాండ్ చేశారు. విద్యార్థి మృతిపై వారు శనివారం పాఠశాలలో విచారణ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ సరైన వైద్యం అందనందునే అశోక్కు మృతి చెందాడని తెలిపారు. ఈ విద్యా సంస్థ ప్రారంభం నుంచి ఇప్పుటి వరకు ముగ్గురు విద్యార్థులు అనారోగ్యంతో మృతి చెందారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపట్టి విద్యార్థుల మృతికి కారణమైన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.