ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1100 రోజులకు చేరుకున్నాయి. దీక్షల్లో పెద్ద సంఖ్యలో ఉక్కు కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ చైర్మన్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం పదేళ్లుగా కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తోందని తెలిపారు. తాజా బడ్జెట్లోనూ పారిశ్రామికవేత్తలకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూర్చే నిర్ణయాలే తీసుకుందని విమర్శించారు. బిజెపిని రానున్న ఎన్నికల్లో ఓడిస్తేనే దేశానికి రక్ష అని అన్నారు. స్టీల్ప్లాంట్ను రక్షించుకునేందుకు జరుగుతున్న అకుంఠిత పోరాటాన్ని తెలియజేశారు. దీక్షల్లో పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, కన్వీనర్ కెఎస్ఎన్.రావు, కో కన్వీనర్ జె.అయోధ్యరామ్, నాయకులు ఎన్.రామారావు, తదితరులు పాల్గొన్నారు.