- టిడిపి జిల్లా అధ్యక్షులు ఇంటిని ముట్టడించిన ఆ పార్టీ కార్యకర్తలు
ప్రజాశక్తి – భీమవరం రూరల్ : పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉండి నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గురువారం టిడిపి జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. సిట్టింగ్ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉండి నియోజకవర్గంలోని నాలుగు మండలాల టిడిపి అధ్యక్షుల ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు నగరంలోని ఎమ్మెల్యే రామరాజు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కార్లు, బైకులతో ర్యాలీగా జువ్వలపాలెం రోడ్డు నుంచి డిఎన్ఆర్ కాలేజీ రోడ్డు మీదుగా తోట సీతారామలక్ష్మి ఇంటికి చేరుకున్నారు. ఆమె ఇంటి ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఇంటి పక్కనే ఉన్న జిల్లా కార్యాలయం వద్ద సీతారామలక్ష్మి మాట్లాడేందుకు సిద్ధమవ్వగా ఒక్కసారిగా కార్యకర్తలు ఆమె వైపు దూసుకొచ్చారు. దీంతో ఆమె కార్యాలయం లోపలకు వెళ్లిపోయారు. లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు తోసుకుంటూ కార్యకర్తలు లోపలికి వెళ్లిపోయారు. అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఇస్తా అన్న చంద్రబాబు ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. రఘురామకృష్ణంరాజు గతంలో పార్టీలోకి వచ్చిన పది రోజులకే బయటికెళ్లి ఉండి సెంటర్లో సైకిల్ తగలబెట్టారని, అలాంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. మీ ఆవేదనలో, ఆందోళనలో న్యాయం ఉందని, ఆందోళన చెందవద్దని కోరారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆమెకు టిడిపి నాలుగు మండల అధ్యక్షులు వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్యకర్తలు అక్కడి నుంచి తిరిగి రాంబాబు కార్యాలయానికి వెళ్లిపోయారు.