శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

Apr 18,2024 11:36 #ttd

తిరుమల : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం ఈనెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఈనెల 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్‌ లైన్‌ కోటాను 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో జూలై నెల గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 27న శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నామని టీడీడీ ముఖ్య ప్రజా సంసబంధాలశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

➡️