ప్రజాశక్తి – తిరుపతి సిటి : తిరుపతి రూరల్ కాలూరు క్రాస్ సమీపంలోని నారాయణ స్కూలులోని ఓ విద్యార్థిపై పాఠశాల యాజమాన్యం దాష్టీకం ప్రదర్శించి చితకబాదింది. విద్యార్థి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు… పాఠశాల యాజమాన్యం రెండో తేదీ అర్ధరాత్రి ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘మీ కుమారుని ఇంటికి తీసుకెళ్లండి’ అంటూ సమాచారం ఇచ్చారు. మూడు తేదీ ఆదివారం తల్లిదండ్రులు కుమారుని దగ్గరకు వచ్చి చూడగా ఆ విద్యార్థి ఒంటిపై గాయాలున్నాయి. ఏమైందని అడుగగా తోటి విద్యార్థుల నగదు దొంగిలించినట్లు ఆరోపించి ఉపాధ్యాయులతో పాటు, వార్డెన్లు సైతం చితకబాదారని తెలిసింది. తల్లిదండ్రులు ఆ విద్యార్థిని రుయా ఆస్పత్రికి వైద్యనిమిత్తం తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు బాలుడికి ఇన్పేషంట్గా వైద్యసేవలు అందిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ ఎస్ఐ నాగేంద్రబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.