ప్రజాశక్తి- మాచర్ల (పల్నాడు జిల్లా) : ఎన్నికల నిబంధనలు ఉల్లఘించినట్లు అందిన ఫిర్యాదు మేరకు పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ పరిధిలోని కారంపూడి మండలం ఒప్పిచర్ల-1 విఆర్ఓ, బూత్ లెవల్ అధికారి (బిఎల్ఒ) వి.కోటేశ్వరరావుకు అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు మాచర్ల ఆర్ఓ, పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం జెసి మాట్లాడుతూ కోటేశ్వరరావు తన వాట్సప్ స్టేటస్లో ఒక రాజకీయ పార్టీకి చెందిన పోస్టు పెట్టినట్లు తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. దీంతో, షోకాజ్ నోటీసు జారీ చేశామని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు విచారణలో తేలితే కోటేశ్వరరావుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.