టిడిపిలోకి కౌన్సిలర్లను ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరామ్
ప్రజాశక్తి-గుంతకల్లు
పట్టణానికి చెందిన ఆరుగురు వైసిపి కౌన్సిలర్లు స్థానిక టిడిపి కార్యాలయంలో గురువారం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. 15వ వార్డు మాజీ కౌన్సిలర్ తాడూరు గోపీ, 32వ వార్దు కౌన్సిలర్ వై.సుధాకర్, 9వ వార్డు కౌన్సిలర్ పి.రవీంద్రకుమార్, 5వ వార్డు కౌన్సిలర్ ఎనుముల భాస్కర్, 37వ వార్డు కౌన్సిలర్ పి.లలిత, 35వ వార్డు మాజీ కౌన్సిలర్ అహ్మద్ బాషా టిడిపిలో చేరారు. వీరికి టిడిపి అభ్యర్థి గుమ్మనూరు జయరామ్, సోదరులు శ్రీనివాసులు, నారాయణస్వామి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జయరామ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి టిడిపి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. తాను గెలిచిన తర్వాత ఇక్కడే ఉండి నియోజకవర్గం అభివృద్ధి కృషి చేస్తానన్నారు. అంతేగాకుండా ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ముక్కన్నగారి గుణశేఖర్, కెసి.హరికుమార్, బండారు ఆనంద్, కోడి శీనా, టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీస్.కృష్ణారెడ్డి, కౌన్సిలర్, ఉడదల ప్రభాకర్, రమేష్గౌడ్, టిడిపి సీనియర్ నాయకులు, బిజెపి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.