క్యాన్సర్ పై అవగాహనా సదస్సు

Feb 4,2024 10:42 #Vizianagaram
cancer aware ness

ప్రజాశక్తి-కర్నూల్ :  వరల్డ్ క్యాన్సర్ డే (4th ఫిబ్రవరి) సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్ వారిచే Close the Care Gap అనే థీమ్ తో క్యాన్సర్ పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేందర్ రెడ్డి, మెడికల్ ఆంకాలజిస్ట్ హాస్పిటల్ సెంటర్ హెడ్, పి. నీలా రెడ్డి హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాఘవేందర్ రెడ్డి, మెడికల్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే, కొన్ని కారణాల వల్ల, ఆ కణాలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఆ స్థితిని క్యాన్సర్ అంటారు. ఈ కణ సమూహాలను ‘కణితి'( ట్యూమర్) అని పిలుస్తారు. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, ఆ తరవాత స్థానం క్యాన్సర్‌దే. ప్రపంచ వ్యాప్తంగా, ఏటా కోటి మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. మన దేశంలో, ప్రతి సంవత్సరం సుమారు పదకొండు లక్షల మందికి క్యాన్సర్ సోకినట్లుగా నిర్ధారణ అవుతోంది. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వీటిలో మొదటి వరుసలో ఉంటున్నాయి. అయితే, మన దేశంలో క్యాన్సర్ బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి, వ్యాధి ముదిరిన తరవాతే ఇది నిర్ధారణ అవుతోంది. దీంతో బతికే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అవగాహన లేక పోవడం, నిరక్షరాస్యత, భయం, వివిధ రకాల అపోహల వల్లే క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతోంది. రొటీన్ స్క్రీనింగ్, ముందుగానే గుర్తించడం, తొలి దశలోనే చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్‌ మరణాల్లో దాదాపు మూడింట ఒక వంతును అడ్డుకోవచ్చు. శరీరంలో ఏదైనా అవయవానికి కేన్సర్ సోకితే తొలిదశలో లక్షణాలు అంతగా కనిపించవు. వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి దీని నిర్ధరణ పరీక్షలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లనూ ఒకే విధమైన పరీక్షతో తెలుసుకోవడం సాధ్యం కాదు. క్యాన్సర్ అంటువ్యాధికాదు. అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా తక్కువే. అయితే, రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, పాంక్రియాస్ క్యాన్సర్లు జన్యుపరంగా సంక్రమిస్తాయి. కుటుంబంలో ఎవరికైనా ఈ కేన్సర్లు వస్తే వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించకపోతే ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు సైతం ఏమాత్రం తగ్గుముఖం పట్టవు. కాబట్టి దీనిపై అవగాహనతో ఎదుర్కొవాలి. కేన్సర్‌కు కారణాల్లో ఆధునిక జీవన శైలి ప్రధానమైంది. మద్యం, పొగతాగడం, ఆహారపదార్థాల్లో రంగులు వినియోగం, రసాయనాలు వాడటం, హార్మోన్లు అధికంగా వాడటం, అధిక బరువు, కాలుష్యం, క్రిమిసంహారకాలు, చికిత్సలో భాగంగా లేదా ప్రమాదవశాత్తు రేడియేషన్‌కు గురికావడం, తరచూ వేధించే ఇన్ఫెక్షన్లు క్యాన్సర్‌కు కారకాలు. కొన్ని రకాల కేన్సర్లను రాకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. వాటిలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌‌కు ప్రధాన కారణం హెచ్‌పీవీ వైరస్. కాబట్టి దీనికి వ్యాక్సిన్ వేసుకుని నివారించవచ్చు. 9 ఏళ్లు పైబడిన బాలికల నుంచి 40 ఏళ్ల మహిళల వరకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అలాగే గొంతు క్యాన్సర్ రాకుండా కూడా ఇది అడ్డుకుంటుంది. అందుకే కేన్సర్ చికిత్సను కూడా వయస్సును బట్టి నిర్ధరిస్తారు. క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయడానికి కీమోథెరఫీ, రేడియోథెరఫీలతో పాటు ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో చేసే కీహోల్ సర్జరీలు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. సర్జరీ తర్వాత రేడియో, కీమో, హార్మోన్ థెరఫీ లాంటివి చేసినా, లేక థెరఫీల తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో అయిపోయిందని భావించరాదు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.క్యాన్సర్ కణం శరీరంలో ఏ అవయవానికి సోకిందనే అనుమానం ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, యఫ్‌యన్‌ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్-రే, సీటీ స్కాన్, యంఆర్‌ఐ, పీఈటీ స్కాన్ వంటివి అవసరాన్ని బట్టి చేస్తారు. అయితే సర్వైకల్ క్యాన్సర్‌ను పాప్‌స్మియర్ ద్వారా ముందుగా గుర్తించవచ్చు అని అన్నారు.

➡️