థానే : పోలీస్ స్టేషన్లోనే శివసేన నాయకుడిపై కాల్పులకు దిగిన మహారాష్ట్రలోని బిజెపి ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్పై ఎస్సి, ఎస్టి (వేధింపులు నిరోధక) చట్టం కింద కేసు నమోదయింది. ద్వార్లి గ్రామానికి చెందిన ఒక గ్రామస్థుడు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, మరో ఏడుగురిపై థానే జిల్లాలోని ఒక పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైందని ఆదివారం పోలీసు అధికారులు వెల్లడించారు. ఒక భూమి యజమానురాలు అయిన మహిళపై కులపరమైన వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పారు. జిల్లాలోని హిల్ లైన్ పోలీస్ స్టేసన్లో సీనియర్ ఇన్స్పెక్టర్ క్యాబిన్లోనే శుక్రవారం రాత్రి శివసేన నాయకుడు మహేష్ గైక్వాడ్పై కల్యాణ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ ఆరు బుల్లెట్లతో కాల్పులకు తెగించాడు. దీంతో మహేష్ గైక్వాడ్, అతని సహచరుడు రాహుల్ పాటిల్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హత్యాయత్నం, ఇతర అభియోగాలతో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది.