పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ రాజీనామా – కంపెనీ ధ్రువీకరణ

న్యూఢిల్లీ : పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL) నుంచి స్వతంత్ర డైరెక్టర్‌ మంజూ అగర్వాల్‌ రాజీనామా చేశారు. గతకొన్ని రోజులుగా వస్తున్న ఈ వార్తలను సోమవారం పేటీఎం బ్రాండ్‌ మాతఅసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఫిబ్రవరి 1 నుంచి ఆమె వైదొలిగినట్లు పేర్కొంది. అంతకుముందు ఆర్‌బిఐ ఆంక్షల నేపథ్యంలోనే ఆమె బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

గ్రూప్‌ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు…

నిబంధనలు, నియంత్రణ అంశాలను కంపెనీ బలోపేతం చేయడం కోసం సెబీ మాజీ చైర్మన్‌ ఎం దామోదరన్‌ అధ్యక్షతన గ్రూప్‌ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేటీఎం బోర్డు గత శుక్రవారం ప్రకటించింది. ఈ కమిటీలో ఐసీఏఐ మాజీ అధ్యక్షుడు ఎం.ఎం.చితలే, ఆర్‌బీఐ ఎంపిక చేసిన బ్యాంకింగ్‌ కోడ్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ బోర్డ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు ఉంటారని తెలిపింది. బ్యాంకింగ్‌ నిపుణులు ఆర్‌.రామచంద్రణ్‌ వంటివారు కూడా సభ్యులుగా ఉంటారని వెల్లడించింది.

పీపీబీఎల్‌పై ఆర్‌బిఐ ఆంక్షలు విధించిన విషయం విదితమే. 2024 ఫిబ్రవరి 29 నుంచి డిపాజిట్లను స్వీకరించొద్దని ఆర్‌బిఐ ఆదేశించింది. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు కూడా చేయొద్దని తెలిపింది. పీపీబీఎల్‌ కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్‌ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, లోపాలు ఉన్నాయని ఆడిట్‌లో నిర్థారణ కావడంతో సంస్థపై మరింతగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తోందని ఆర్‌బిఐ వెల్లడించింది.

➡️