కర్నూలు మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

Dec 2,2023 14:35 #Kurnool
  • యూజీసీకి ఫిర్యాదు చేసిన జూనియర్‌ విద్యార్థులు

ప్రజాశక్తి-కర్నూలు : కర్నూలు మెడికల్‌ కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్‌ చేస్తున్నారంటూ జూనియర్‌ విద్యార్థులు ఆరోపించడం కలకలం రేపింది. సీనియర్ల వేధింపులపై ఏకంగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం సంచలనంగా మారింది. తమ రికార్డులు రాసి పెట్టాలని, తమ గదికి భోజనాలు తీసుకురావాలని సీనియర్లు వేధిస్తున్నారని జూనియర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కలగజేసుకోవాలని, తమకు వేధింపులు తప్పేలా చర్యలు తీసుకోవాలని జూనియర్‌ విద్యార్థులు యూజీసీకి లేఖ రాశారు. ఈ ఫిర్యాదుతో స్పందించిన యూజీసీ.. ర్యాగింగ్‌ విషయాన్ని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లింది. కాలేజీలో, విద్యార్థుల హాస్టల్స్‌లో ర్యాగింగ్‌ నివారణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.ఇటీవలే కాలేజీ అనుబంధంగా ఉన్న మెన్స్‌ హాస్టల్‌లో గంజాయి, మద్యం సీసాలు బయటపడడం సంచలనం సష్టించింది. దీనిపై కాలేజీ ప్రిన్సిపాల్‌ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈలోపే కాలేజీ మరోసారి వార్తల్లో నిలిచింది.

➡️