నా కొడుకుని చూసి గర్వపడుతున్నా!

Feb 4,2024 09:54 #Sneha
actress suhasini proud of son

నాలుగు భాషల్లో ఎన్నో విజయాలు అందుకున్నారు. ఆరు పదుల వయసులోనూ భార్య, తల్లి, నటి, నిర్మాత, దర్శకురాలు ఇలా భిన్న పాత్రలతో నేటితరానికి ఆదర్శంగా నిలిచారు. కేరళలో జరిగిన ఓ ఈవెంట్‌లో సుహాసిని మణిరత్నం పాల్గొని, తన కొడుకు లైఫ్‌స్టైల్‌ గురించి మీడియాతో పంచుకున్నారు. సహజంగా తలిదండ్రులు ఇద్దరూ చిత్రపరిశ్రమలో ఉంటే పిల్లలూ ఆ వైపుగా అడుగులు వేస్తారు. కానీ తన కుమారుడు ఆ దారిలో రాలేదని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని సంగతులు..

‘తమిళనాడులోని పరమకుడి మా ఊరు. మాది ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో కారు కాదు కదా, కనీసం ఫ్రిజ్‌ కూడా ఉండేది కాదు. నేను చదువుకున్నది కూడా మున్సిపల్‌ స్కూల్లోనే. నాన్న చారుహాసన్‌, బాబారు కమల్‌హాసన్‌ అప్పటికే సినిమాల్లో నటిస్తున్నారు. నాన్నకు తోడుగా ఉంటానని నన్నూ పంపారు. రామకృష్ణ మిషన్‌ వారి శారద విద్యాలయ, క్వీన్‌ మేరీస్‌ కాలేజీలో నా చదువు సాగింది. మనం వేసుకునే దుస్తుల నుంచి చేసే పనుల వరకూ అన్నింటినీ అందరూ గమనిస్తారు. అందుకే ప్రతి పనిలోనూ జాగ్రత్తగా, బాధ్యతగా ఉండటం అలవాటు చేసుకున్నా. నాకు బాగా ఇష్టమైన దర్శకులు కె. బాలచందర్‌, సత్యజిత్‌ రే. బాలచందర్‌ దర్శకత్వంలోని ‘సింధు భైరవి’ లో నా పాత్రకు జాతీయ పురస్కారం దక్కింది.

అనుకోకుండా నటినయ్యా..

చదువుకునే రోజుల్లో బ్యాంక్‌ మేనేజర్‌ కావాలనేది నా కల. నాన్నేమో నన్ను ఇంజినీర్‌గానో, కలెక్టర్‌గానో చూడాలనుకున్నారు. అమ్మ నన్ను ఇంగ్లీష్‌ లెక్చరర్‌ చేయాలనుకునేది. కానీ అవేవీ కాకుండా.. బాబాయ్ ప్రోత్సాహంతో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరాను. అచ్చంగా పక్కింటి అమ్మాయిలా ఉంటానని బాలూ మహేంద్రగారు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాకే ఉత్తమనటిగా తమిళనాడు ప్రభుత్వ అవార్డు వచ్చింది. అప్పటికి నా వయసు పందొమ్మిది. మణిరత్నంగారి అన్నయ్య, మా నాన్నగారు మంచి స్నేహితులు. వాళ్లు ముందే మాట్లాడుకుని మా పెళ్లి నిశ్చయించారు. ఆ తర్వాతే, మమ్మల్ని ఓసారి కలిసి మాట్లాడుకోమని చెప్పారు. అప్పుడే మళ్లీ కలిశాం. కాసేపు మాట్లాడుకున్నాక తెలిసింది.. మా ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు ఒక్కటేనని. అలా మా పెళ్లి జరిగింది. నాకు చదవడం, రాయడం, నేర్చుకోవడం.. చాలా ఇష్టం. ఒకే చట్రంలో ఎప్పుడూ ఇరుక్కుపోకూడదు. లాక్‌డౌన్‌లో దొరికిన సమయాన్ని వృథా చేసుకోకుండా పియానో నేర్చుకున్నా. దక్షిణాది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలను. ప్రస్తుతం ఫ్రెంచ్‌ నేర్చుకుంటున్నా. దర్శకురాలిగా టీవీ సిరీస్‌తోపాటు షార్ట్‌ ఫిలిమ్స్‌, వెబ్‌ సిరీస్‌ చేశా. ఓ మీడియా ఆర్గనైజేషన్‌తోనూ పనిచేస్తున్నా. రాజా రవివర్మ చిత్రాలను రీక్రియేట్‌ చేసేందుకు కృషి చేస్తున్నా. ‘ఎన్‌ఎఎఎం’ ఫౌండేషన్‌ ద్వారా సమాజంలో అవసరమైన వారికి చేయూత అందిస్తున్నాం’ అని చెప్పారు.

ఈ మధ్యకాలంలో కేరళలో రాష్ట్ర ఫిల్మ్‌ అకాడమీ నిర్వహించిన హ్యాపీనెస్‌ ఫెస్టివల్‌లో భాగంగా తాలిపరంబలో రెండవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుహాసినీని కొడుకు నందాహాసన్‌ గురించి మీడియా ప్రశ్నలు వేయగా.. అతని లైఫ్‌స్టైల్‌ పట్ల తాను తృప్తిగా ఉన్నానని చెప్పారు. ‘నందన్‌ ఇతర పిల్లల్లా కాదు. చిన్నతనంలో పాఠశాల నుంచి ఇంటికి వచ్చినప్పుడు, వెంటనే భారత పార్లమెంటు సమావేశాల టెలికాస్ట్‌ను సీరియస్‌గా చూసేవాడు. నేను ఇలాంటి బిడ్డకు జన్మనిచ్చానా అని ఆశ్చర్యపోయాను. పన్నెండేళ్ల వయస్సులో ”పెట్టుబడి” గంథ్రం చదవడం ప్రారంభించాడు. ఓ రోజు చేతిలో పుస్తకం పట్టుకుని సిపిఎం కార్యాలయానికి వెళ్లాడు. తన వద్ద కారు ఉందని పార్టీ సభ్యులకు తెలియకూడదని, దానిని వేరేచోట పార్క్‌ చేయమని చెప్పి, ఆఫీసులోకి వెళ్లాడు. పార్టీ సభ్యులు ఆయన్ను మొదట అడిగింది భోజనం చేశావా? అని. అది కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేకత. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని వారు అడగలేదు. నందా అన్నం తిన్న తర్వాత, పార్టీ కార్యదర్శిని కలిశాడు. తన తండ్రి పేరు గురించి అడిగినప్పుడు, మణిరత్నం అని చెప్పకుండా అతను అసలు పేరు గోపాలరత్నం సుబ్రమణ్యం అని చెప్పాడు. అమ్మ పేరు అడగ్గా సుహాసిని అని చెప్పాడు. వెంటనే ఆయన మణిరత్నం కొడుకువా? అని అడిగారు. అలా నందన్‌ వాలంటీర్‌ సభ్యుడుగా చేరాడు. తర్వాత కాలంలో కమ్యూనిస్టు భావజాలంతో ముందుకు వెళుతున్నాడు. అందుకు నేను గర్వపడుతున్నా’ అని అన్నారు.

➡️